తెలంగాణ ముద్దుబిడ్డ బాపూజీ కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ (97) ఇకలేరు. ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని తన స్వగృహలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్న బాపూజీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం ఆయన తెలంగాణ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915లో సెప్టెంబర్ 27న జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. క్విట్ ఇండియా, నాన్ముల్కీ ఆందోళనల్లో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో మంత్రిపదవినే వదులుకున్నారు. ఇటీవలే నవ తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం కృషిచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మృతి పట్ల రాజకీయ నేతలు, ప్రముఖలు సంతాపం తెలిపారు.
Freedom fighter, Telangana leader Bapuji is dead | Telangana activist and former minister Konda Lakshman Bapuji passed away today at his residence in Hyderabad.
